అమెరికాలో ఓ హైదరాబాద్ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన నార్త్ కరోలినాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనిత (38) భర్త రాచకొండ శివకుమార్ వేధింపులకు తాళలేక కొంతకాలం క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆపై గత జూలైలో అమెరికాలోని తన భర్త వద్దకు వెళ్లిపోయింది. రెండు నెలల నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేయలేదు.
ఈ క్రమంలో ఆదివారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో, ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది. అత్తింటి వేధింపులు భరించలేకే వనిత మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. ఘటన జరిగిన అనంతరం ఆమె భర్త రాచకొండ శివకుమార్ను అదుపులోకి తీసుకున్న కరోలినా పోలీసులు విచారణ చేపట్టారు.