ప్రొ కబడ్డీ సీజన్-7 పోటీల్లో భాగంగా యుపి-తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 28-28 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఇరుజట్లు రైడ్ల ద్వారా 13 పాయింట్లను సాధించగా… ట్యాకిల్స్లో మాత్రం యుపి 13 పాయింట్లను గెల్చుకుంది. తొలి అర్ధభాగానికే యుపి జట్టు 16-11 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. కానీ రెండో అర్ధభాగంలో తమిళ్ రైడర్లు రాణించారు. అంతేగాక యుపి-తమిళ్ జట్లు రెండేసిసార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్ కూడా చేశాయి. తమిళ్ జట్టులో రాహుల్ చౌదరి(5), మంజిత్ ఛిల్లార్(4) పాయింట్లను సాధించగా… యుపి జట్టులో రిషాంక్ దెవాడిగా(5), మోనూ గోయట్(3) పాయింట్లను సాధించారు.
హర్యానా స్టీలర్స్ జట్టు పట్నా పైరెట్స్పై 9 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగం సమయానికే హర్యానా 17-9 పాయింట్ల ఆధిక్యతను సంపాదించింది. రెండో అర్ధభాగంలో పట్నా కొంత ప్రతిఘటించినా… చివర్లో హర్యానా రైడర్లు రెచ్చిపోవడంతో 35-26 పాయింట్లతో పట్నాను చిత్తుచేసింది. ఈ మ్యాచ్లో హర్యానా ట్యాకిల్స్లో అదరగొట్టడం విశేషం. ఆ జట్టు 12మంది పట్నా రైడర్లును ఔట్ చేశారు. హర్యానా రైడర్ వికాస్ ఖండోలా(11), వినరు(6), రవికుమార్(4) పాయింట్లను సాధించగా… పట్నా జట్టులో పర్దీప్ నర్వాల్(14), లీ(4) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్లో పట్నా రైడర్ పర్దీప్ నర్వాల్ 900 రైడ్ పాయింట్లను పూర్తి చేసుకోవడం విశేషం.