సీనియర్ సిటిజన్ల పెన్షన్ రూ.400 నుంచి 500కు పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారంనాడు నిర్ణయం తీసుకుంది. అలాగే మైక్రోబ్రెవరీస్ అనుమతించేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీకాంత్ శర్మ మీడియాకు తెలిపారు. 60 నుంచి 79 ఏళ్ల లోపు వయసున్న సీనియర్ సిటిజన్లకు ప్రతినెలా ఇచ్చే పింఛనును పెంచినట్టు ప్రకటించారు. 79ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే రూ.500 ఇస్తున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మెక్రో బ్రెవరీలు అనుమతించనున్నట్టు కూడా మంత్రి తెలిపారు. ఇందుకు గాను నిబంధనల్లో అవసరమైన సవరణలు చేస్తామని చెప్పారు. లైసెన్సు ఫీజులు పెంచుతామని, ఏడాదికి 2.1 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అనుమతిస్తామని తెలిపారు. రాయబరేలిలో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని, 2020 నాటికి ఆ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్ నాథ్ సింగ్ తెలిపారు.