సాధారణంగా బైకుపై వెళ్తున్నప్పుడు ప్రాణరక్షణ కోసం హెల్మెట్లు ధరిస్తాం. కానీ ఉత్తర్ప్రదేశ్లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రతిరోజు హెల్మెట్లు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. తమ తలలు పగిలిపోకుండా ఉండాలంటే హెల్మెట్ వాడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని బాందా జిల్లాలోని విద్యుత్ శాఖకు చెందిన భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి.
చిన్న వర్షం కురిసినా నీరు కారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సి వస్తోంది. అందుకే వారంతా ఇలా వినూత్నంగా కార్యాలయంలో పనిచేస్తున్నారు.ఏదైనా ఊహించని ప్రమాదం జరుగుతుందని భావించి తమను తాము రక్షించుకోవడానికి ఆఫీస్లో విధుల్లో ఉన్నప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని చాలాసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఈ సమస్యపై ఎవరూ స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.