సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల ధర్నాలు, ఆరోపణలతో ఇరు వర్గాల మధ్య పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కోల్ కతాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు బీజేపీ తెలిపింది.
యోగి సభ నిర్వహించే వేదికను ధ్వంసం చేశారని బీజేపీ తెలిపింది. వేదికను నిర్మించిన వ్యక్తిని కూడా చితకబాదారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారును భర్తరఫ్ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చివరి విడత ఎన్నికల ప్రచారంలో మమతను పాల్గొననకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.