ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2017లో ఉద్యోగం కోసం వెళ్లిన బాలికను కుల్దీప్ సెంగార్ తన కామవాంఛలకు బలిచేశాడు. అయితే ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. సెంగార్ పై కేసులు నమోదు చేయకపోగా బాధితురాలి తండ్రిపై అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడంటూ కేసు నమోదు చేశారు. బాధితురాలు సీఎం నివాసం ముందు న్యాయం కావాలంటూ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఈ ఘటన తర్వాత ఆమె తండ్రి పోలీసు కస్టడీలోనే ప్రాణాలు వదిలాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కుల్దీప్ సెంగార్ ను అరెస్ట్ చేశారు.
అయితే కోర్టుకు తన బంధువులతో కలిసి వెళుతుండగా, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మృతి చెందారు. ఇన్నాళ్లకు బాధితురాలికి న్యాయం జరిగింది. ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం సెంగార్ ను దోషిగా నిర్ధారించడంతో పాటు, తాజాగా యావజ్జీవం విధిస్తూ తీర్పునిచ్చింది.