గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ ట్రస్టుకు చైనా దౌత్య కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
అంతకుముందు, గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదన్నారు. దురాక్రమణలకు పాల్పడకపోతే ఇంతమంది భారత సైనికులు ఎలా చనిపోయారు? వారు చనిపోయింది ఎవరి భూభాగంలో? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.