telugu navyamedia
రాజకీయ

సిరివెన్నెల పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని..

తెలుగు సినీ గేయరచయిత చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు మాటలను పాటలుగా కూర్చి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారని కొనియాడారు.

తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని అన్నారు. తెలుగు పాటకు విలువలను అద్ది, నలుగురికీ నచ్చే విధంగా, పదిమంది మెచ్చే విధంగా రాయడంలో వారు సిద్ధ హస్తులని గుర్తు చేసుకున్నారు.

తెలిసిన మాటలనే గాక, తెలుసుకోవాలనిపించే మాటలను కూడా పాటల్లో అందంగా అల్లే సిరివెన్నెల దివికేగడం తెలుగు పాటకే గాక, తెలుగు సాహిత్యానికి సైతం తీరని లోటన్నారు. 2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయని అనాటి సంగతులను నెమరు వేసుకున్నారు.

సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

 

Related posts