తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉత్తరాది కూలీలు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు చరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలు కూడా పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి ఈ సొరంగంలో పని చేసేందుకు సుకేందర్ సింగ్, చందన్ రాయ్ అనే ఇద్దరు కూలీలు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో పని ముగించుకుని అక్కడే పడుకున్నారు. ఈ సమయంలో సొరంగంలోకి వచ్చిన ఓ టిప్పర్ పడుకున్న వీరిద్దరిపై నుండి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. చీకట్లో వీరిని టిప్పర్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.