telugu navyamedia
క్రైమ్ వార్తలు

నదిలో రెండు పడవలు ఢీ, 100 మంది గల్లంతు?

అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌లో జరిగిన ఈ ఘటనలో దాదాపు 100 మంది గల్లంతైనట్లు సమాచారం. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ తిరుగు ప్రయాణం చేస్తున్న మరో పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా ఈత రానివారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే NDRF‌, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

Related posts