హైదరాబాద్ టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది.
ఈ నేపథ్యంలో కవరేజ్ కోసం టీవీ9 కార్యాలయం వద్ద అన్నీ చానల్స్ ప్రతినిధులు కెమరాలతో సిద్దంగా ఉన్నారు. కవరేజ్కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారు.. లైవ్ కవరేజ్ చేస్తున్న డీఎస్ఎన్జీ వాహనం వైర్లు తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారావణం నెలకొంది.