తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాత్తుగా కన్నుమూశారు. కార్తీక దీసోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్ళిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు..
ఆయన భౌతికకాయాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ నుంచి తిరుపతి తరిలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమనేవారని చెప్పారు. 2013లో శేషాద్రికి కిడ్నీ మార్పిడి జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు. డాలర్ శేషాద్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా..టీటీడీ అధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద కార్తిక మహా దీపోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి హాజరవుతున్నారు. సుమారు 5 వేల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఎంవీపీ కాలనీ టీటీడీ ఈ-కౌంటర్ ద్వారా భక్తులకు పాస్లు జారీచేస్తున్నారు.