ఏపీలో కొలువై ఉన్న టీటీడీ(తిరుమలతిరుపతి దేవస్థానం) నిత్యం కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తుంటుంది. స్వామివారి బ్యాంక్ బ్యాలన్స్ ఏ అపర కుబేరుడికి తీసిపోని రీతిలో ఉంటుంది. వేల కోట్ల నగదు, టన్నుల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున వజ్రాలు… కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటాచలపతి వైభోగం అంతాఇంతా కాదు. గత రెండేళ్లుగా స్వామి వారి ఖజానాలో పోగుపడిన చిల్లర నాణేల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.20.5 కోట్ల విలువ చేసే చిల్లర టీటీడీ వద్ద నిల్వ ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
నేడు రూ.5.15 కోట్ల చిల్లర నాణేలను టీటీడీ అధికారులు బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. గతంలో కొన్ని బ్యాంకులు చిల్లర డిపాజిట్ చేసుకునేందుకు మొగ్గు చూపలేదని సమాచారం. తాజాగా, టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి ప్రయత్నాల ఫలితంగా పలు బ్యాంకులు చిల్లర నాణేల డిపాజిట్ చేసుకునేందుకు ముందుకు వచ్చాయి.