ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి అందింది. ఆర్డర్ కాపీ అందిందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి… ఆర్డర్ లో ఏముందనే విషయంపై అధ్యయనం చేసి, అధికారులతో సాధ్యాసాధ్యాలపై చర్చించి వెంటనే నివేదిక తయారు చేయాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధాన సలహారుడు రాజీవ్ శర్మను ఆదేశించారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఇతర ముఖ్య అధికారులతో ప్రగతి భవన్ లో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైకోర్టు కాపీని పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపే అవకాశముంది. ఈ సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ కోర్టు తీర్పు, ఇతర అన్ని అంశాలపై చర్చించి.. ఆర్టీసీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.