మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద హైదరాబాద్ లోని ఆఫ్జల్ గంజ్ వద్ద అపహరణకు గురైన టీఎస్ఆర్టీసీ బస్సు ప్రత్యక్షమైంది. నాందేడ్ సమీపంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఏరియా కంకిడిలో బస్సు ఏ పార్టుకు ఆ పార్టు విడిపోయి ఉన్న స్థితిలో పోలీసుల కంటపడింది. అక్కడ ఓ షెడ్డులో బస్ ఛాసిస్ మాత్రమే మిగిలుంది. కీలకమైన విడిభాగాలను దుండగులు సొమ్ముచేసుకునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు రంగప్రవేశం చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. పోలీసుల రాకతో మరో ముగ్గురు పారిపోయారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసుల విచారిస్తున్నారు.
మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును కుషాయిగూడ డిపోకు చెందిన డ్రైవర్ ఆఫ్జల్ గంజ్ బస్ స్టాప్ వద్ద నిలిపాడు. అయితే బుధవారం ఉదయం చూస్తే బస్సు అక్కడ లేకపోవడంతో చోరీకి గురైనట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బస్సు తూఫ్రాన్ టోల్ గేట్ దాటి వెళ్లినట్టు తెలుసుకుని ఆ దిశగా గాలింపు చేపట్టారు. చివరికి నాందేడ్ వైపు వెళ్లినట్టు తేలడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.