తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ మాత్రమే వచ్చే జూన్ నెలాఖరులో జరగనున్నాయి. మిగిలిన అయిదు ప్రవేశ పరీక్షలు జులైలో జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది.
ఇంటర్ పరీక్షలు మే 7వ తేదీన ముగియనుండటంతో ఆ తర్వాత ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ మూడు లేదా నాలుగో వారంలో మిగిలిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జూన్ నెలాఖరులో నిర్వహించే అవకాశముంది. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.
మిగిలినవి జులైలో…
మిగిలిన ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్ సెట్లను జులైలో చేపట్టాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారే ఈ అయిదు ప్రవేశ పరీక్షలకు హాజరవుతారు. వారికి చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ నెలాఖరు వరకు జరుగుతాయి. ఆ తర్వాత వారం, పది రోజుల సమయం ఇచ్చి జులైలో ప్రవేశ పరీక్షలను జరపాలని ఉన్నత మండలి నిర్ణయించింది.