అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీ ఐ చీఫ్ నియామకం కోసం జరిగిన సెనేట్ విచారణకు భారత సంతతి వ్యక్తి కశ్యప్ పటేల్ తాజాగా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడంతో పాటు తన ప్రసంగంలో ‘జై శ్రీకృష్ణ’ అనడం ఆసక్తికరంగా మారింది.
తల్లిదండ్రులవల్లే తాను ఇక్కడి వరకూ రాగలిగానని కశ్యప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్యప్ పటేల్ ను ఎఫ్ బీ ఐ చీఫ్ పోస్టుకు నామినేట్ చేసారు.
గుజరాతీ తల్లిదండ్రులకు 1980లో న్యూయార్క్ లో జన్మించిన కశ్యప్ పటేల్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యారు.
ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం పటేల్ న్యూయార్క్ కు తిరిగి రావడానికి ముందు రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో తన అండర్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశారు.
ఆ తర్వాత తన లా డిగ్రీ, ఇంటర్నేషనల్ లాలో సర్టిఫికేట్లను యునైటెడ్ కింగ్డమ్ లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి సంపాదించారు.
మిస్టర్ పటేల్ హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి జాతీయ భద్రతా సలహాదారుగా, సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.
ఇప్పుడు నియామకం పూర్తైతే ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమితుడైన మొదటి హిందూ, తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు.