అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ట్రంప్ అంత ఫేమస్. అయితే… ట్రంప్కు అమెరికాలోనే కాదు..ప్రపంచ నలుమూలల అభిమానులున్నారు. అంతేందుకు మన దేశంలోనే ట్రంప్కు అభిమానులున్నారు. అభిమానులే కాదు…ఆరాధించే వ్యక్తులే ఉన్నారు. అది ఎక్కడో కాదు… తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన బుస్స కృష్ణ అనే వ్యక్తి ట్రంప్ ను తన ఆరాధ్యదైవంగా అభిమానిస్తుంటాడు. బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామంలో బుస్స కృష్ణ తన ఇంటికి సమీపంలో ట్రంప్కు ఏకంగా నిలువెత్తు విగ్రహం పెట్టి…పూజలు సైతం చేస్తుంటాడు.
ఈ విషయం ట్రంప్కు తెలిసి మెచ్చుకున్నాడు కూడా.. బుస్స కృష్ణ గురించి ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. బుస్స కృష్ణను తప్పకుండా కలుసుకుంటానని ఆ ట్వీట్ లో తెలిపాడు ట్రంప్. ఇటీవలే ట్రంప్ ఇండియా వచ్చిన సమయంలో కృష్ణ ఆయనను కలుసుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే..ఇటీవల ట్రంప్కు కరోనా సోకింది. ఈ విషయం తెలిసిన కృష్ణ దిగులు పడ్డాడు. తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడు. దీంతో ఆరోగ్యం క్షిణించి ఈ రోజు హఠాత్తుగా మృతిచెందాడు. ఈ విషయాన్ని కృష్ణ కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.