telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కాదు… అసలు కథ ఇదీ…!

Syeraa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన దేశంలో మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అనే ప్రచారాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కాదని కొందరు వాదిస్తున్నారు. ఇలా వాదించే వాళ్లలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొల్లోజు బాబా ఒకరు. ఈ మేరకు ‘రూరల్ మీడియా’కు బాబా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పాలెగాళ్ల వ్యవస్థను రద్దుచేసి, పాలెగాళ్లకు పించను ఇచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీపై ఒక పాలెగాడు చేసిన తిరుగుబాటు తప్ప దీనిలో స్వాతంత్య్ర ఉద్యమం ఏమీ లేదు. చరిత్రను వక్రీకరించి స్వలాభం కోసం ఇలాంటి ప్రచారం చేయడం తగదు. కనీసం తొలి పాలెగాళ్ల పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్య్ర పోరాటంలా ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. సీడెడ్ ప్రాంతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఆయా ప్రాంతాలు దఖలు పడటంతో వాటిని స్వాధీనం చేసుకోవటమనే భాద్యతను థామస్‌ మన్రో అనే అధికారికి కంపెనీ అప్పగించింది. 1800 నవంబరు 9న థామస్‌ మన్రో బళ్లారికి వచ్చాడు. భూమి శిస్తు వసూలులో రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఒప్పించాడు.

రైతు వారి వ్యవస్థ అంటే జమిందార్లు, పాలెగాళ్లు లాంటి మధ్యవర్తులకు కాక రైతులకే నేరుగా భూమి అప్పగించి వారి నుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ. ఇది అప్పట్లో గొప్ప విప్లవాత్మక భూసంస్కరణ. 1800లో ఈ సీడెడ్‌ పాంతాలలోని భూమినంతా కంపెనీ స్వాధీనం చేసుకొంది కంపెనీ. పాలెగాళ్లందరూ తమ అధికారాన్ని, పెత్తనాన్ని రాత్రికి రాత్రి కోల్పోయారు. అంతవరకూ తరతరాలుగా భూమిపై హక్కులు అనుభవిస్తున్న పాలెగాళ్లు దీన్ని వ్యతిరేకించారు. పాలెగాళ్లందరినీ చర్చలకు పిలిచి వారి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి కంపెనీ నుంచి పించను ఏర్పాటు చేసి చాలామట్టుకు పాలెగాళ్ల అసంతృప్తిని తొలగించగలిగాడు థామస్‌ మన్రో. అయినప్పటికీ తాము కోల్పోయిన హక్కుల్ని పునరుద్ధరించుకోవటం కోసం కోటల్ని ఆక్రమించుకొంటూ, గ్రామాల్లో కంపెనీ అధికారుల్ని చంపివేస్తూ అనేక మంది పాలెగాళ్లు తిరుగుబాట్లు చేసారు. 1800 డిసంబరు నెలలో బళ్ళారిలో హరి నాయకన్‌ తిరుగుబాటు, 173 మంది కంపెనీ సైనికుల మరణానికి కారణమైన 1801 నవంబరు నాటి పొటేల్‌ తిరుగుబాటు, 1802 జులై నెలలో దివాకర్‌ నాయర్‌ చేసిన తిరుగుబాటు, 1804లో కుద్రిత్‌ ఉల్లాఖాన్‌, ఇతర పాలెగాళ్లు చేసిన తిరుగుబాటు, 1804 మార్చ్‌ 27న కొనకొండ్ల కోటను స్వాధీనం చేసుకొన్న గురువప్ప నాయర్‌ తిరుగుబాటు లాంటి అనేక పాలెగాళ్ల పోరాటాలను కంపెనీ సైన్యం అణచివేసింది. కొంతమందిని ఉరితీసింది.

నొసుమ్‌ సంస్థానానికి పాలెగాడు నరసింహారెడ్డి. నొసుమ్‌ సంస్థానాన్ని కంపెనీ స్వాధీనం చేసుకొనే సమయానికి, అంతవరకూ బాకీపడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800లో థామస్‌ మన్రో పిలిచారు. కానీ నొసుమ్‌ నరసింహారెడ్డి హాజరు కాలేదు. క్రమేపీ ఏ ఆదాయవనరులూ లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో తన పంతాన్ని వీడి, పించను తీసుకొని, ఇంటికే పరిమితమై 4, నవంబరు 1804లో చనిపోయాడు. నొసుమ్‌ నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకూ అతనికి ఏడాదికి ఇస్తున్న 8,323 రూపాయిల పించనును అతని భార్యకు బదలాయించింది కంపెనీ. నొసుమ్‌ నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి మూడు తరాలు గడిచిపోవటం, వారసులకు పించను పంచుకొంటూ రావటం వల్ల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాటా పది రూపాయిల పది అణాల ఎనిమిది పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపెనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు.

భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన గోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపెనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరూ తిరిగి మిగిలిన బాధిత పాలెగాళ్లను ఏకం చేయగలిగాడు. వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలైలో తాహసీల్దారును, కంపెనీ గుమస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి అనుచరుల సంఖ్య అయిదువేలకు పెరిగింది. వీరిలో ఎక్కువగా బోయలు, యానాదులు, చెంచులు ఉన్నారు. నరసింహారెడ్డి కొంతకాలం కంపెనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్‌ 6న కడప కలక్టర్‌ కాక్టేన్‌ కుయుక్తుల వల్ల అరస్టయి ఉరితీయబడ్డాడు. పాలెగాళ్ల వ్యవస్థ ఫ్యూడల్‌ సమాజపు నిర్మాణం. ఇందులో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దాని తాలూకు పీడన, కులాధారిత వెట్టిచాకిరీ ఉంటుంది. దాన్ని పునఃస్థాపించటానికి చేసిన వ్యక్తిగత పోరాటాన్ని దేశభక్తిగా ప్రొజెక్ట్‌ చేయటం, కనీసం తొలి పాలెగాళ్ల పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్య్ర పోరాటంలా ప్రచారం చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది’’ అని బొల్లోజు బాబా పేర్కొన్నారు. మరి ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts