ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయ్భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. . దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారని తెలిపారు.
ప్రజలు సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదని, ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్ అవే ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. పేదల పట్ల తాపత్రయం ఉన్న టీఆర్ఎస్ నాయకులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని ధ్వజమెత్తారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.