బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక తరహాలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యతాయుతంగా మాట్లాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగైన పథకమని చెప్పారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పెన్లన్లపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్, బీజేపీకి నచ్చడం లేదన్నారు. ఎగిరెగిరిపడుతున్న బీజేపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.