టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులుగా హెటిరో ఛైర్మన్ డాక్టర్. బండి పార్థసారథి, ఖమ్మం జిల్లా గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్ రావును ఎంపిక చేశారు.
ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే
కాగా..ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈనెల 19తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్… రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికలకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. మూడుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశించినా… సీఎం కేసీఆర్.. వీరివైపే మొగ్గుచూపారు.