తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే చర్చలకు ప్రభుత్వం సిద్ధమని టీఆర్ఎస్ నేత కే కేశవరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కార్మికులు చేస్తున్నడిమాండ్లలో ప్రభుత్వంలో విలీనం చేయాలన్న విషయం తప్ప, మిగతా అన్ని సమస్యలనూ పరిష్కరించే ఉద్దేశం తమకుందన్నారు. కార్మికులు వెంటనే సమ్మెకు స్వస్తి చెప్పాలని ఆయన సలహా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేయవద్దని సూచించారు. సమస్యకు ఆత్మహత్యలు, బలిదానాలు పరిష్కారం కాదని హితవు పలికారు. విలీనం తప్ప మిగతా డిమాండ్లపై స్పష్టమైన హామీలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని గతంలోనే ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దని చెప్పిన కేకే, ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ఎన్నడూ హామీ ఇవ్వలేదని చెప్పారు.