నేడు రాజ్యసభలో బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో పాస్ అయ్యింది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లను పాస్ చేశారు. ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది. ముస్లిం మహిళలకు రక్షణగా నిలువాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు బీజేపీ చెబుతోంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన భార్యకు మూడు సార్లు తలాక్ చెబితే అతనికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందని బిల్లులో పొందుపర్చారు.
రెండవ సారి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొలి ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు. పలు పార్టీలు బిల్లను వ్యతిరేకించినప్పటికీ…. బిల్లు సమానత్వంను కలగజేయడంతో పాటు సామాజిక న్యాయం కూడా చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే బిల్లను పార్లమెంటరీ కమిటీకి పంపాలని విపక్షాలు కోరుతున్నాయి. లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ రావడంతో అక్కడ బిల్లు సులభంగా పాస్ అయ్యింది. అయితే రాజ్యసభలో మాత్రం బిల్లును పాస్ చేయించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో బీజేపీకి సంఖ్యబలం లేదు. పైగా తన మిత్రపక్షం అయిన జేడీయూ ఈ బిల్లను వ్యతిరేకిస్తుండటం విశేషం.