హైదరాబాద్ లోని బహదూర్ పురా వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, వాహనంలోని 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ కు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఈరోజు హైదరాబాద్ లోని బహదూర్ పురా ప్రాంతానికి రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో నెహ్రూ జువాలజికల్ పార్కు సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన బస్సు పక్కకు పల్టీ కొట్టింది.
దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబు అమరావతిపై అసలే మాట్లాడలేదు: మంత్రి బుగ్గన