దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 అర్ధరాత్రి వరకూ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 324కి చేరడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. బస్సుల కంటే రైళ్లలోనే దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికమంది ప్రయాణిస్తుంటారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి మరింతగా సహకరించాలన్న ఉద్దేశంతో రైళ్ల రద్దు నిర్ణయాన్ని రైల్వే శాఖ ఈ నెల 31 అర్ధరాత్రి వరకు పొడిగించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లు గమ్యస్థానం చేరేందుకు అనుమతించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోనుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించనుంది.