telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ్ పోస్ట్ ఎవరికి.. తెరపైకి టీపీసీసీ చీఫ్ వ్యవహారం!

uttam congress mp

మునిపిపల్ ఎన్నికల తరువాత తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా వెల్లడించారు. దీంతో తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

ఉత్తమ్ తప్పుకుంటానని వెల్లడించిన నేపథ్యంలో కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరవుతారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పురపాలక సంఘాల ఎన్నికల తరువాత త్తమ్ తప్పుకుంటారని, గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఉత్తమ్ రాజీనామా చేస్తే ఆ పోస్ట్ కి చాలా మంది నేతలు పోటీలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం రెండు, మూడు పేర్లను మాత్రమే పరిశీలిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిల్లో ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని తెలుస్తోంది.

యువతలో క్రేజ్ ఉండటంతో రేవంత్ కు పదవి దక్కుతుందని ఓ వర్గం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం లభిస్తుందని మరో వర్గం వాదిస్తోంది. అయితే, రేవంత్ అభ్యర్థిత్వంపై మాత్రం కొందరు నేతలు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్ బాబుకు అనుకూలంగా రాష్ట్రంలోని కొందరు సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Related posts