విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ అండగా నిలిచింది. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన అనంతరం విదేశీ క్రికెటర్లను వారి సొంత దేశాలకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతీ ఒక్క ఆటగాడు తమ ఇళ్లకు క్షేమంగా చేరిన తర్వాతే టోర్నీ ముగిసినట్లు భావిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ హేమంగ్ అమిన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెయిల్ చేశాడు. ‘మీలోని చాలా మంది పడుతున్న ఆవేదన మాకు అర్థమైంది. లీగ్ ముగిసిన తర్వాత స్వదేశాలకు ఎలా వెళ్లాలనే విషయంపై మీరంతా ఆందోళన చెందుతున్నారు. దాని గురించి మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సొంత దేశాలకు సజావుగా వెళ్లడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. కొవిడ్ పరిస్థితులను చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్నాం. మేము ప్రభుత్వ వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. మీలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరాకే టోర్నీ ముగిసినట్లుగా భావిస్తాం.’అని హేమంగ్ అమిన్ ఆ మెయిల్లో స్పష్టం చేశారు.
previous post