టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చెందారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని నానక్రామ్గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్కు తరలిస్తారు. శుక్రవారం మహా ప్రస్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. విజయనిర్మల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి విజయ నిర్మల లాంటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో ఇంకెవరిని చూడలేం అని పేర్కొన్నారు. అరుదైన దర్శక నటీమణి విజయ నిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిరంజీవి అన్నారు. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మలగారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభా పాటవాలని చాటారు. అంతని ప్రతిభావంతురాలని మనం ఇప్పట్లో ఇంకెవరిని చూడలేం. కృష్ణ గారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడు ఆయన పక్కన నిలబడి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
విజయనిర్మల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. బాలనటి నుంచి ఎన్నో గొప్ప చిత్రాల్లో విజయనిర్మల నటించారని కొనియాడారు. ఎన్టీఆర్తో మారిన మనిషి, పెత్తందార్లు, విచిత్రకుటుంబం సినిమాల్లో విజయనిర్మల నటించారని బాలకృష్ణ పేర్కొన్నారు. 44 చిత్రాలకు దర్శకత్వం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సొంతం చేసుకున్న విజయనిర్మలగారు తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవితా రాజశేఖర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. విజయ నిర్మలగారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘మీనా’ నాకు చాలా ఇష్టం. అది పక్కన పెడితే… ‘దేవుడే గెలిచాడు’ అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే, ఆవిడ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. విజయనిర్మలగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణగారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆవిణ్ణి ఎక్కువగా మిస్ అయ్యేవ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా అండర్స్టాండింగ్తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్ కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా” అని అన్నారు.