కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ రామ్గోపాల్ వర్మ ఉంటారు. వివాద స్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారుతాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకొని చిత్ర విచిత్రమైన పోస్టులు పెడుతూ వార్తలు ఎక్కుతాడు.
టాలీవుడ్లో ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైర్లు వేశారు.
ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలని ట్విటర్ వేదికగా వర్మ కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్గా మారింది.
కాగా.. తెదేపా నేత పట్టాభి తో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై వైకాపా జరిపిన దాడులకు పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
అందుకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు.