నేడు ప్రపంచ కప్ లో ఇండియా వెస్టిండీస్ తో తలపడనుంది. ఒకపక్క ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నీ గెలిచి సెమీస్ దిశగా అడుగులేస్తున్న టీమ్ఇండియా.. ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు ఓడి నాకౌట్ అవకాశాల్ని బాగా సంక్లిష్టం చేసుకున్న వెస్టిండీస్ను ఢీకొనబోతోంది. గత మ్యాచ్లో పసికూన అఫ్గానిస్థాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొని త్రుటిలో ఓటమి నుంచి బయటపడ్డ కోహ్లీసేన.. ఈ మ్యాచ్లో తన స్థాయిని చాటి చెప్పాల్సిందే. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తన పాయింట్లను 11కు పెంచుకుని సెమీఫైనల్కు చేరువవుతుంది. తర్వాతి మ్యాచ్లో బలమైన ఇంగ్లాండ్ను ఢీకొనాల్సిన నేపథ్యంలో విండీస్ను మట్టికరిపించి కోహ్లీసేన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరముంది.
భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విండీస్ను ఓడించడం తేలికే. అయితే మరో ఓటమి ఎదురైతే.. సెమీస్ అవకాశాలు పూర్తిగా అడుగంటి పోతాయి కాబట్టి విండీస్ తెగించి ఆడే అవకాశముంది. టాప్ఆర్డర్ నిలిస్తే భారత్కు తిరుగుండదు. ఫామ్లో ఉన్న రోహిత్, కోహ్లిల నుంచి భారత్ భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తోంది. పాక్తో మ్యాచ్లో తడబడ్డ ప్రధాన పేసర్ బుమ్రా.. అఫ్గాన్పై తన బౌలింగ్ వాడి చూపించడం సానుకూలాంశం. ఆ మ్యాచ్లో ఆడిన షమి కూడా సత్తా చాటాడు. స్పిన్నర్లు నిలకడగానే రాణిస్తున్నారు. అయితే విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే..!