telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ బర్త్ డే…ఎన్టీఆర్ స్టేడియంలో యాగం

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోతున్న ఓ యాగం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ యాగం పేరు అధి శ్రవణ యాగం.. దాదాపు 600 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో  సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ అధి శ్రవణయాగాన్ని నిర్వహించడం విశేషమనే చెప్పాలి. స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) ఛైర్మన్ అలీపురం వెంకటేశ్వరరెడ్డి, దువ్వూరి గణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అధి శ్రవణ యాగంకు ఓ ప్రత్యేకత ఉంది.. 600 సంవత్సరాలకు పూర్వం కేరళ రాష్ట్రంలో కేవలం నంబూద్రి బ్రాహ్మణులు మాత్రమే ఈ యాగాన్ని చేసేవారు. ఇంకెవరు ఈ యాగాన్ని చేసేందుకు సాహసించలేదు.

మళ్లీ ఇప్పుడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా లోక కల్యాణ నిమిత్తం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అధిశ్రవణ యాగంతో బాధలు, అగ్ని సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు తొలగి, రాష్ర్టం సస్యశ్యామలమవుతుందని పండితుల నమ్మకం. అత్యంత ప్రాశస్త్యమైన ఈ యాగంలో పాల్గొనే వారు హిందూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ముందుగా గోత్ర నామాలను నమోదు చేయించుకోవాలి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ యాగం సాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గోపూజ, మహా గణపతి పూజ, పుణ్యాహవచనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ఆదిత్యాది నవగ్రహ చతుషష్ఠి, అధి శ్రావణ మహారుద్ర యాగం, దుర్గా హవనం, శ్రీ హవనం, బలి, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి, తీర్థ ప్రసాదవితరణతో యాగం ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. మొత్తంగా 600 ఏళ్ల తర్వాత ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పవిత్రమైన అధిశ్రవణ యాగం సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.

Related posts