ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారశైలిపై చంద్రబాబు ఈసీకి వివరించనున్నారు. చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తి పల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్సీలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేత చెవిరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరో వైపు చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిన్న రాత్రి కమ్మపల్లిలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో రీపోలింగ్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.