శ్రీలంకలో ఓవైపు భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేస్తుండగానే మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోకు సమీపంలో తూర్పు వైపున ఉన్న పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మాట్లాడుతూ పుగోడాలోని కోర్టు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరోవైపు ఈస్టర్ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.