తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ మహిళా కండక్టర్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణమని ఆయన ఆరోపించారు.
రాజ్యాంగబద్ధంగా కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించిందని… కానీ, ప్రభుత్వం మాత్రం యూనియన్ నేతలతో ఖైదీల తరహాలో వ్యవహరించిందని విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల చర్చలు మళ్లీ జరిగేందుకు అవకాశం లేకుండా పోతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే సకలజనుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.