ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా ఏపీలో పలుచోట్ల జూనియర్ డాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలోని అలిపిరి వద్ద కొండపైకి వెళ్లే భక్తులను జూనియర్ డాక్టర్లు అడ్డుకున్నారు. దీంతో, భక్తులు ఇబ్బందులు పడ్డారు. జూనియర్ డాక్టర్లతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. విజయవాడలో అరెస్టు చేసిన జూనియర్ డాక్టర్లను విడుదల చేయాలని తిరుపతి జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.