telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనం పున:ప్రారంభం: టీటీడీ

tirumala temple

కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. అంతకుముందు, ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు చేపట్టనున్నారు. జూన్ 8, 9వ తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. 10వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం అందించనున్నారు. ఆపై సాధారణ దర్శనాలు ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న 3 వేలమందికి, నేరుగా వచ్చే మరో 3 వేలమందికి శ్రీవారి దర్శనం ఏర్పాటు చేస్తామని టీటీడీ పేర్కొంది.

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా గానీ వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడినవారికి, పిల్లలకు దర్శనాలు ఉండవని అన్నారు. ఈ నెల 11 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కేవలం ఒక గంట మాత్రమే అని వెల్లడించారు. ఆపై ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకు సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.

Related posts