telugu navyamedia
క్రైమ్ వార్తలు

అన్న కుటుంబంపై కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

వరంగల్‌ ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్‌ ఏసీపీ కల్కోట గిరికుమార్‌ ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ ఎల్బీ నగర్‌లో మహమ్మద్‌ చాంద్‌పాషా తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయనకు తన తమ్ముడు షఫీతో ఏడాదిగా పశువుల వ్యాపారం లావాదేవీల్లో వివాదం నడుస్తోంది. సుమారు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం చాంద్‌పాషా ఇంటిలోనే ఆయన కుటుంబంపై దాడి చేశాడు.

తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో షఫీతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాంద్‌పాషా ఇంటి తలుపులను కట్టర్‌ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న చాంద్‌పాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు సహేద్‌, సమీర్‌, బావమరిది ఖలీల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో చాంద్‌బాషా, సబీరా బేగం, ఖలీల్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారులు ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షఫీయే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చాంద్‌పాషా కుమార్తె రుబీనా పోలీసులకు తెలిపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Related posts