ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లోని కదిరిలో విషాదం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నది ఉప్పొంగడంతో అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి.
శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు కుప్పకూలిపోయి పక్కనే ఉన్న ఇళ్ళపై పడింది. దాంతో ఒక్కసారిగా నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు. ఈ శిథిలాల కింద మొత్తం 13 మంది చిక్కికున్నారు. ఒక ఇంట్లో 8 మంది ఉండగా… మరో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనస్థలానికి చేరుకున్నారు. జేసీబీల సహాయంతో పోలీసులు , రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్నవారి కోసం బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శిథిలాలు తొలగిస్తున్నారు.
కాగా.. కడప జిల్లా రాజంపేట సమీపంలో అన్నమయ్య ఆనకట్ట శుక్రవారం తెగిపోవడంతో ప్రవహించే నీటిలో కొట్టుకుపోయినఎనిమిది మంది మృతి చెందగా, మరో 50 మంది గల్లంతైనట్లు సమాచారం. రిజర్వాయర్ మండలంలో రోడ్డుపై వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులే ఎక్కువ మంది బాధితులు అని తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో అనంతపురంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. గంతుమర్రి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ఓ యువకుడు మృతి చెందాడు.
అనంతపురం జిల్లా వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది మధ్యలో మట్టి తరలింపులో చిక్కుకుపోయిన 10 మందిని యలహంక నుండి IAF హెలికాప్టర్ రక్షించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుని రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి శనివారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.