చిన్న మాట అంటే కోర్టుకెక్కుతున్న ఈ రోజులలో బహుశా కేసులు ఎక్కువ అవుతున్నాయనేమో.. కోర్టు కూడా సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. ఏదో కోపంలో ఎవరిమీదకైనా వెళ్లి.. నీ అంతు చూస్తా అంటూ.. బెదిరిస్తే, తప్పులేదని తాజాగా గుజరాత్ హైకోర్టు స్పష్టం చేయడం సంచలనంగా మారింది. అది నేరపూరితమైన బెదిరింపు కాదట.
సబర్కాంత జిల్లాలోని ప్రంతిజ్కు చెందిన న్యాయవాది మహ్మద్ మొహిసిన్ చలోటియా 2017లో తన క్లయింట్ను కలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులకు, ఆయనకు మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వివాదంలో పోలీసులను అంతు చూస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘‘మీ అందరి సంగతి చూస్తా.. మిమ్మల్ని కోర్టుకీడుస్తా’’ అని లాయర్ బెదిరించినట్టు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మీ అంతుచూస్తానని బెదిరించారంటూ లాయర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ‘మీ అంతు చూస్తా’ అనేది నేరం కాదని స్పష్టం చేసింది. మీ అంతు చూస్తాననడం నేరపూరిత బెదిరింపు కిందకు రాదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.