కాబోయే అత్తారింటికే కన్నం వేశాడో ఓ అల్లుడు.పెళ్లి కుమార్తె ద్వారా అత్తవారింట్లోని నగల విషయాన్ని తెలుసుకొని, రూ.2.20 లక్షల నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్, పాతబస్తీలోని కాలాపత్తర్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శాస్త్రిపురం కింగ్ కాలనీకి చెందిన సల్మాన్ఖాన్ (27) సేల్స్మన్. కాలాపత్తర్కు చెందిన యువతితో అతడికి వివాహం నిశ్చయమైంది.పెళ్లి కుమార్తె ద్వారా అత్తవారింట్లోని నగదు, నగలు విషయాన్ని తెలుసుకున్న సల్మాన్ఖాన్ వాటిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ రచించాడు.
ప్రార్థనల కోసం కాబోయే అత్తింటివారు దర్గాకు వెళ్లిన విషయం తెలుసుకున్న సల్మాన్ తన పథకాన్ని అమలు చేశాడు.ఇంటికి చేరుకుని కిటికీ తొలగించి లోపలికి దూరాడు. బీరువాలోని నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. దర్గా నుంచి ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు నగలు, నగదు మాయం కావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా చోరీ చేసింది కాబోయే అల్లుడేనని తేల్చారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.