భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”. సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తుండగా సునీల్ బోహ్రా, జయంతిలాల్ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా చూపించారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అంతేకాదు రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని సృష్టించింది.
ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు 37 మిలియన్ వ్యూస్ లభించాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్లో కనిపించడంలేదట. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ వ్యవహారం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. “డియర్ యూట్యూబ్… “యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” ట్రైలర్ యూట్యూబ్లో కన్పించడంలేదు. ఈ విషయం గురించి నా అభిమానుల నుంచి మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయి. మొన్నటివరకు మా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్స్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చూస్తే అసలు కనిపించడంలేదు. సాయం చేయండి” అని ట్వీట్ చేస్తూ… అభిమానుల కోసం మరోసారి ట్రైలర్ లింక్ను పోస్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేతలు సినిమా విడుదలకు ముందు తమకు ప్రత్యేక స్క్రీనింగ్ ను వేయాలని, లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే అనుపమ్ ఖేర్ మాత్రం మన్మోహన్ సింగ్ దీనికి ఒప్పుకుంటేనే స్పెషల్ స్క్రీనింగ్ వేస్తామని సమాధానం చెప్పారు.
Dear @YouTube!!! I am getting messages & calls that in parts of our country if you type, trailer of #TheAccidentalPrimeMinister, it is either not appearing or at 50th position. We were trending at No.1 yday. Please help. #HappyNewYear. #37millionviews 😊https://t.co/TUu4AtaRzk pic.twitter.com/KhoZJuxmmu
— Anupam Kher (@AnupamPKher) January 1, 2019