telugu navyamedia
Bhakti సామాజిక

తదియ చంద్రుని పూజ

పరమశివుడు తన జటాఝూటం లో చంద్రకళని ధరించినందున చంద్రశేఖరుడని పిలువబడు తున్నాడు. పరమేశ్వరుడు ప్రధమం గా చంద్రుని తన శిరసున ధరించిన ఆలయం  తంజావూరు జిల్లాలోని మహిమాలై గా చంద్రమౌళీశ్వరుని ఆలయ చరిత్ర తెలుపుతున్నది.

జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుని స్ధానం  అనేది ముఖ్య అంశం. భూలోకంలో చంద్రుని స్ధానంగా చెప్పబడేప్రాంతం మహిమాలై. మహిమాలై తదియ చంద్రుని దర్శించడం పరమేశ్వరుని ప్రత్యక్షంగా దర్శించినట్లే నంటారు. ఈ ఆలయానికి సమీపమున సూర్య స్ధానం ఐన సురైక్కాయూరువుండడం విశేషం.

ఒకసారి పార్వతీదేవి కైలాసంలోని పరమశివుని నేత్రాలను సరదాగా మూసింది. తక్షణమే ముల్లాకాలలో అంధకారం అలుముకుంది. పంచ భూతాలు, ప్రాణి కోటి స్థంభించింది. ఈ ఆకస్మిక విపరీత పరిణామాలు చూసి పార్వతీ దేవి విస్మయం చెంది తన పతి ముఖం మీదనుండి తన చేతులను తీసేసింది. తక్షణమే సకలజగత్తు యదాస్థితికి వచ్చి చైతన్యం పొందింది. సర్వకాల స్థితి గతులకు పరమేశ్వరుడే మూలాధారమని యీ సంఘటన విశదపరుస్తున్నది. లోకమంతా  అంధకారబంధురం కావడానికి తనే కారణ మని భావించిన అంబిక ఈశ్వరుని పూజించడానికి భూలోకానికి వచ్చినది. పార్వతీదేవి మానవ స్త్రీ రూపంలో ఒక ప్రాంతం లోని భక్తులందరిని చేరదీసి అన్నపూర్ణా దేవి వలె వారి ఆకలి బాధను తీరుస్తూ కాపాడుతూ వచ్చింది. తన మూలంగా ఈ  లోకం తిరిగి చీకటిమయమై ప్రకృతి అస్తవ్యస్తం కాకుండా వుండడం కోసం ఈశ్వరుని వరం కోరాలని  సంకల్పించినది పార్వతీదేవి.

ఒక మెట్ట మీద తపస్సు చేస్తూవున్న అగస్త్య మహర్షిని చూసింది. ఆ ప్రాంతమే మహిమాలై చంద్రమేడు. జరిగిన విషయం అంతా మహర్షికి తెలియజేసింది. పార్వతి చెప్పినది విని అగస్త్య మహర్షి ఆశ్చర్యంతో  “ప్రపంచం అంధకారమైనదా, నాకు తెలియదు” అని అన్నాడు. లోకమంతా అనుభవించిన ఆ   దుర్భర స్థితి అగస్త్య మునికి ఎందుకు కలగలేదనే సందేహం పార్వతీదేవికి వచ్చింది.

పరికించి చూడగా అగస్త్య మహర్షి సన్నిధిలో చంద్రస్ధానమున  తదియ చంద్రుని ధరించిన తేజోమయ స్వయంభూ శివలింగం  దర్శనమిచ్చినది.

అగస్త్య మహర్షి పార్వతీదేవి సందేహం తీరేలా “తల్లీ! పరమ శివుడు  ఇచట తన శిరసున ప్రకాశవంతమైన తదియ చంద్రుని ధరించి దర్శనమిస్తున్నాడు. ఇకపై ఎప్పుడూ లోకాన్ని అంధకారం చుట్టముట్టదు.” అని అన్నాడు.

అప్పుడు అగస్త్య మహర్షి సంచరిస్తున్న ప్రాంతాలలోని ప్రజలంతా వచ్చి మహేశ్వరుని స్వయంభూ లింగాన్ని భక్తి శ్రధ్ధలతో పూజించారు. పార్వతీదేవి వారందరికి భోజనాలు స్వయంగా ప్రసాదించినది.

కాలక్రమేణా అక్కడ ఆలయం  నిర్మించబడినది.ఆలయప్రవేశ ద్వారం పై పార్వతి పరమేశ్వరులు కైలాసంలో ఆశీనులైన భంగిమలో సున్నపు రాతి విగ్రహాలు దర్శన మిస్తాయి.

మహామండపంలో నందికేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ మండపం వెలుపల ఎడమ ప్రక్కగా గణపతి, కుడిప్రక్కగా కుమారస్వామి వారికీ సమీపమున అయ్యప్పన్ దర్శనమిస్తున్నారు.

ఆ మండపం దాటాక గర్భగుడిలో పరమేశ్వరుడు చంద్రమౌళిగా, స్వయంభూమూర్తిగా ప్రజలను కాపాడుతున్నాడు.ఈ స్వామిని ప్రార్ధిస్తే వారి వారి జాతకాలలోని చంద్ర దోషాలు నివృత్తి అవుతాయి.

ఆ మండపానికి సమీపమున ‘ప్రపంచానికే అన్నం ప్రసాదించే’ అన్నపూర్ణాదేవి కొలువై వున్నది. మరొక ఆవరణలో దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు.

ఏడాది పొడుగునా ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. ఈ ఆలయం తదియ చంద్రుని దర్శనానికి పేరు పొందినది. ఈ తదియ చంద్రుని దర్శనంతో
గత జన్మలోని పాపాలు తొలగిపోతాయి. స్తీలకి మాంగల్య బలం సిధ్ధిస్తుంది. మానసిక వ్యాధులు నయమౌతాయి. జ్ఞాపకశక్తి వృధ్ధి చెందుతుంది. కంటిచూపు మెరుగు పడుతుంది. ఐశ్వర్యం వృధ్ధి చెందుతుంది. బ్రహ్మ హత్యా పాపం తొలగిపోతుంది.

తదియతిధి కలసిన శనివారం రోజున చేసే చంద్రుని దర్శనం, సంవత్సరం అంతా చంద్రుని దర్శించినంత పుణ్యప్రదం.

తదియచంద్రుని మూడు సార్లు దర్శిస్తే ఎటువంటి మూఢుడైనా  తెలివైనవాడు అవుతాడని అంటారు.

నాలుగసార్లు వరుసగా తదియ చంద్రుని దర్శించిన పాపాలు నశిస్తాయి.

ఐదు సార్లు వరుసగా తదియ చంద్రుని దర్శించిన  పేదవాడు కోటీశ్వరుడవుతాడు.

వరుసగా ఆరుసార్లు తదియ చంద్రుని దర్శించిన ఎటువంటి అడ్డంకులు లేకుండా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఎల్లప్పుడూ తదియ చంద్రుని దర్శిస్తూనే వుండేవారికి తరగని సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఐహీకం.

తంజావూరు జిల్లాలోని అమ్మపేట్టై నుండి కుంభకోణం వెళ్ళే మార్గంలో 5 కి.మీదూరాన  మహిమాలై క్షేత్రం వున్నది.

Related posts