కేంద్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతాచర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కశ్మీర్లో అల్లర్లు జరిగిన దాఖలాలు లేవు. తాజాగా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ అక్కడ కలకలం సృష్టించే చర్యలకు దిగుతోంది. పుల్వామా జిల్లా మొత్తం హిజ్బుల్ సంస్థ కొన్ని పోస్టర్లు అంటించింది. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా కశ్మీరీలంతా ఏకంకావాలని ఒక్క తాటిపైకొచ్చి తమ హక్కుల కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చింది.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి అక్కడ పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కొన్ని చోట్ల ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆంక్షల వలయంలో జీవిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాదు అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం … విపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీనగర్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో పర్యటించేందుకు వెళ్లిన విపక్షపార్టీ నేతలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని ప్రశ్నిస్తున్నారు.