మరోసారి ఉగ్రదాడి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కేవలం టూరిస్టులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో ఉగ్రమూకల లక్ష్యం తెలుస్తుంది. తాజాగా జరిగిన ఘటనలో, కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విదేశీయులే లక్ష్యంగా ఓ హోటల్పై దాడులకు తెగబడ్డారు. నైరోబిలోని వెస్ట్ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ‘డస్టిట్ డీ2’ హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనలో 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని ప్రాథమికంగా నిర్థారించారు. వివరాల్లోకి వెళితే…విదేశీయులు అధికంగా ఉండే హోటల్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు తొలుత హోటల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపైకి బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించారు. అనంతరం ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం ముష్కరులు తుపాకులతో కాల్పులకు దిగారు.
ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ అమెరికన్ కూడా ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకున్నా 10 నుంచి 15 వరకు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందగానే హుటాహుటిన చేరుకున్న భద్రతా బలగాలు హోటల్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్మాషియాంగ్ ఖండించారు. ఉగ్రమూకలు ఇటువంటి చర్యలతో మమ్మల్ని ఓడించలేరని ప్రకటించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ‘ఆల్ షహాబ్’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.