*తెలంగాణలో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్..
*పరిహారం కోసం ధర్నా చేపట్టిన నిర్వాసితులు..
*నిర్వాసితులకి పోటీగా టీఆర్ ఎస్ శ్రేణులు ధర్నా
*హుస్నాబాద్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోటాపోటీ ఆందోనలు..
*అడ్డుకోబోయిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాసితులు
హుస్నాబాద్ లో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన గుడాటిపల్లి వాసులపై పోలీసులు లాఠీచార్జికి నిరసనగా మంగళవారం నాడు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గౌరెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ను నిలిపేయాలంటూ రెండు రోజులుగా గుడాటిపల్లి భూనిర్వాసితులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్థానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ తమ గోడు పట్టడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. క్యాంప్ కార్యాలయాన్ని గుడాటిపల్లి భూ నిర్వాసితులు ముట్టడించే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున హుస్నాబాద్ కు తరలి వచ్చారు. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మరో వైపు ఆందోళనకారులకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారుల దాడిలో సీపీ సతీశ్, ఎస్ఐ శ్రీధర్కు గాయాలయ్యాయి.
పోలీసుల లాఠీచార్జీ చేయడంతో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. తమపై ఆందోళనకారులు దాడి చేశారని టీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు.