దేవాలయాల్లో జరుగుతున్నా దాడులపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఆధ్వర్యంలో కాసేపట్లో శాంతి యజ్ఞం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ తీరు దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై దేవాలయ ధర్మాదాయ శాఖ అరిష్ట నివారణ శాంతి హోమాలు చేయాలని, అయితే వారు చేయట్లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తామే ఈ హోమం చేస్తున్నామని వివరించారు. ఆలయాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని చెప్పుకొచ్చారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.