నేడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సీనియర్ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్బాబు లివింగ్ లెజెండ్స్ ఏవీ లాంఛ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రచయితలు సరస్వతీ పుత్రులు. వారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. నా జీవితంలో చాలా విషయాలున్నాయి. మొట్టమొదట.. నేను అప్రెంటీస్గా పనిచేసింది ఎం.ఎం. భట్.. గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు.. ఇలా ఎంతోమంది నాకు పరిచయం.
ఆరుద్ర ఎన్నో సిల్వర్ జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆయన చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. నేను మొదట వేషం కావాలని వెంటపడింది సత్యానంద్గారి దగ్గరే. ఆ విషయాలను గుర్తుచేసుకుంటే ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అలాంటి వ్యక్తిని నా చేతుల మీదుగా సన్మానించుకోవడం దేవుడిచ్చిన అదృష్టం. నాకు తండ్రిలాంటి దాసరి, సోదరుడు రాఘవేంద్రరావు.. ఇలా ఆ దర్శకుల ఆశీస్సులతో ఈ స్థితిలో ఉన్నా. ఎందరో మేధావులు ఇండస్ట్రీలో వున్నారు. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్కు మొదట సత్యానంద్గారు మాటలు రాశారు. ఒళ్ళుపులకరించే డైలాగ్స్ రాసేవారు. పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా రాశారు. అసెంబ్లీ రౌడీ..25 వారాలు ఆడింది. ప్రతీ డైలాగ్ చప్పట్లు కురిపించింది. సత్యమూర్తి కూడా చాలా రాశాడు. మనకంటే ఎందరో అందగాళ్ళు, మేథావులున్నారు. ఈ కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది. దాన్ని కాపాడుకుందాం. రచయితల ఆశీస్సులు మాకు కావాలి అని పేర్కొన్నారు.