telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడికి పితృవియోగం

Indraganti

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గురువారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో క‌న్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ప్ర‌ముఖ క‌వి, సాహితీవేత్త‌గా సాహిత్య లోకానికి ఆయ‌న ఎన్నో సేవ‌లు చేశారు. ల‌లిత గేయాలు, క‌విత‌లు, రేడియో నాటిక‌లు, డాక్యుమెంట‌రీలు, సంగీత రూపకాల‌ని ఆయ‌న ర‌చించారు. స‌మ్మోహ‌నం చిత్రంలో ‘మనసైనదేదో’ అనే పాట ఆయ‌న క‌లం నుండి జాలువారింది. మే 29,1944న తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురంలో జ‌న్మించిన‌ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ రోజు అనారోగ్యం కార‌ణంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఇంద్ర‌గంటి శ్రీకాంత్ శ‌ర్మ ఇక లేర‌ని తెలియ‌జేస్తూ, ఆయ‌న సాహితీవేత్త‌గానే కాకుండా మంచి మ‌నిషిగా అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నార‌ని తెలిపాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అష్టాచెమ్మా సినిమా చూసి ఆయ‌న చాలా గ‌ర్వంగా ఫీలయ్యార‌ని, చిత్ర బృందాన్ని అభినందించార‌ని నాని గుర్తు చేసుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. చివ‌ర‌గా “స‌మ్మోహ‌నం” వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయ‌న ప్ర‌స్తుతం నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “వీ” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Related posts