20వ శతాబ్దంలో సినిమా ఓ అద్భుతమైన ప్రక్రియ .నాటక రంగం మీద నటీనటుల ప్రదర్శన ఆ కాసేపే. కానీ, సినిమా ఆలా కాదు. ఆయా నటీనటులను ఎప్పటికీ మన కళ్ళ ముందు సాక్షాత్కరింప జేస్తుంది. మనిషి సాధించిన అద్భుతమైన సాంకేతిక ప్రగతి సినిమా.
సినిమా ప్రారంభమైన తరువాత అందుల నటించిన నటీనటులు భౌతికంగా మరణించినా, ఇప్పటికీ వారిని మనం తెరపై చూడగలుగుతున్నాము .ఇది నిజంగా అబ్బురము , అపురూపం కూడా .
సినిమా నటీనటులు మరణించినా వారు తెర మీద మాత్రం ఎప్పటికీ చిరంజీవులుగానే మిగిలిపోతారు .ఈనెల 13న నాటకం, టీవీ, సినిమా రంగాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు రాజబాబు గారి 65వ జయంతి. రాజబాబు అనగానే టీవీ ,సినిమా రంగాల మిత్రులు వెంటనే ” కాకినాడ ” రాజబాబు గారా ? అంటారు .
అవును ఆయన కాకినాడ రాజబాబే . తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేటలో జన్మించారు .రాజబాబు తండ్రి రామతారకం . తల్లి అనంత లక్ష్మి సరస్వతీదేవి, రామతారకం, దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం “, “దేవుడు చేసిన పెళ్లి ” ,సినిమాల నిర్మాతల్లో ఒకరు . తండ్రి వారసత్వాన్ని రాజబాబు సినిమా రంగంలో కొనసాగించి తనదైన ముద్రను అటు సినిమా, ఇటు టీవీ మీద వేసిన సహజ నటుడు.
రాజబాబుది విభిన్నమైన , విలక్షణమైన వ్యక్తిత్వం . రాజబాబుతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే అది జీవిత కాలం కొనసాగవలసిందే..గోదారొళ్ల యాస , భాష మాత్రమే కాదు , అభిమానం , ఆత్మీయత కలబోసుకున్న స్వచ్ఛమైన స్నేహపాత్రుడు రాజబాబు .
రాజబాబు స్వతహాగా హాస్యప్రియుడు , ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరపూస్తాయి , స్నేహ మాధుర్యం పరిమళిస్తుంది.
రాజబాబు కు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం . ఎక్కడ నాటకం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు . ఆ ఇష్టం , అభిమానమే ఆయన్ని రంగస్థలం మీదకు తీసుకు వచ్చింది .
మొదటగా “ఊరుమ్మడి బతుకులు ” నాటకంలో రాజబాబు నటించారు . ఆయన నటనను అందరూ మెచ్చుకున్నారు . స్నేహితులైతే రాజబాబును సహజమైన నటుడంటూ ప్రశంసలు కురిపించారు . ఆ స్పూర్తితో “పుటుక్కు జర జర డుబుక్కు మే “, పూజకు వేళాయెరా ” నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నారు .
1995లో రాజబాబు జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది .రాజబాబుకు చిన్ననాటి స్నేహితుడు ఉప్పలపాటి నారాయణ రావు . శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన “వూరికి మొనగాడు” చిత్రంలో రాజబాబుకు ఓ వేషం ఇచ్చారు . ఆ సినిమా రాజబాబు ను వెండితెర వైపు తన ప్రయాణాన్ని కొనసాగేలా చేసింది . ఆ తరువాత “సిందూరం “, మురారి “, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”, “శ్రీకారం ‘, “సముద్రం “, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు “, “కళ్యాణ వైభోగం “, మళ్ళీరావా ?”, “భరత్ అనే నేను ” మొదలైన చిత్రాల్లో రాజబాబు నటించారు .
ఇక టీవీ లో “అభిషేకం “, “వసంత కోకిల “, “రాధా మధు “, “మనసు మమత”, “బంగారు కోడలు “, “బంగారు పంజరం “, “చి. ల .సౌ స్రవంతి ” , “ప్రియాంక ” లాంటి సీరియళ్ళలో రాజబాబు విలక్షణమైన పాత్రలను పోషించారు .
సినిమా, టీవీ ఏ పాత్ర లోనైనా అవలీలగా ఇమిడిపోయే తత్త్వం , ఆ పాత్ర ను సజీవంగా మన మధ్యకు తీసుకురాగల మనస్తత్వం రాజబాబు ప్రత్యేకత . రాజబాబు సహజ నటుడు . ఏ రసాన్నైనా పండించగల ప్రజ్ఞ ఆయనలో వుంది .
రాజబాబు ఈరోజు మన మధ్య లేరు . కానీ ఆయన జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగా వున్నాయి .ఆయన నటించిన టీవీ సీరియళ్లు , సినిమాలు రాజబాబును చిర స్మరణీయంగా చేశాయి కుటుంబ సభ్యులు , ఆత్మీయ మిత్రులు , సినిమా ప్రముఖుల మధ్య జన్మదిన వేడుకలు 13న జరుగుతున్నాయి .